Cyber Crime : సైబర్ కుట్రకు బలైన మాజీ పోలీసు అధికారి.. 8 కోట్లు కొల్లగట్టడంతో బలవన్మరణం
పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమర్ సింగ్ చాహల్ మరణించారు
పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమర్ సింగ్ చాహల్ మరణించారు. భారీ సైబర్ మోసానికి ఆయన బలయ్యారరు. దాదాపు 8.10 కోట్ల రూపాయలు నష్టపపోయారు. దీంతో అమర్ సింగ్ మనస్థాపానికి గురయ్యారు. తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమర్ సింగ్ చాహల్ మరణించారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోనూ పోలీసు వర్గాల్లోనూ సంచలనంగా మారింది. పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ గార్డుకు చెందిన రివాల్వర్తో ఆయన కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నార.
పెట్టుబడి పెట్టి...
సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కొన ఊపిరితో ఉన్న చాహల్ను పార్క్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఫలించక ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, తాను మోసపోయిన తీరును, ఆర్థిక ఇబ్బందులను ఆయన వివరించారు. గత అక్టోబర్లో ఓ మోసపూరిత కంపెనీలో చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట తన సొంత డబ్బు కోటి రూపాయలు పెట్టుబడిగా పెట్టగా, ఆ తర్వాత కంపెనీ డిమాండ్ల మేరకు స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మిగతా మొత్తాన్ని చెల్లించారు.
కెరీర్ వివాదాలు కూడా...
అమర్ సింగ్ చాహల్ కెరీర్లో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జరిగిన బెహబల్ కలాన్, కోట్కపురా కాల్పుల ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పలువురు పోలీసు అధికారులపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత హోదాలో పనిచేసిన అధికారి సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదని దీనిని బట్టి అర్థమవుతుంది. మాజీ పోలీసు అధికారులను కూడా సైబర్ మాోసగాళ్లు వదలకపోవడం ఇప్పుడు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అందుకే ఎవరైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా, తెలియని లింకులు ఓపెన్ చేయవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.