నిమిష ప్రియకు ఉరి శిక్ష ఖాయం.. అన్ని ప్రభుత్వాలు విఫలమయినట్లేనా?

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు యెమన్ ప్రభుత్వం తెలిపింది

Update: 2025-07-09 04:59 GMT

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు యెమన్ ప్రభుత్వం తెలిపింది. నిమిష ప్రియ యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిందితురాలిగా నిర్ధారించింది. అయితే ఈ హత్య కేసును విచారించిన అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధించింది. భారత ప్రభుత్వం నిమిష ప్రియ కుటుంబ సభ్యులతోనూ, యెమన్ అధికారులతోనూ సంప్రదింపులు చేస్తుంది. అయినా ఇప్పటికే శిక్ష ఖరారు కావడంతో ఉరిశిక్ష అమలు చేయడానికి యెమెన్ అధికారులు సిద్ధం చేశారు.

2018లో హత్య చేసి...
2018లో నిమిష ప్రియ యెమెన్ జాతీయుడిని హత్య చేసింది. 2008లో యెమన్ కు వెళ్లిన నిమిష ప్రియ అక్కడ అనేక ఆసుపత్రుల్లో నర్సుగా పనిచేసింది. తర్వాత స్వయంగా ఒక క్లినిక్ ను ఏర్పాటు చేసుకుంది. యెమన్ చట్టాలను అనుసరించి స్థానికులు ఖచ్చితంగా వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండాలి. అందుకోసం నిమిష ప్రియ యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదిని భాగస్వామిగా క్లినిక్ లో చేర్చుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు, వ్యాపారంలో విభేదాలు తలెత్తాయి.
మత్తు ఇంజక్షన్ ఇచ్చి...
దీంతో 2018లో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదిని హత్య చేసింది. అతనికి మత్తు ఇంజెక్షన్ ఎక్కువగా ఇవ్వడంతో అతను మరణించాడు. డోస్ ఎక్కువ కావడం వల్ల మరణించాడని చెబుతున్నప్పటికీ ఆర్థిక లావాదేవీల కారణంగానే కావాలని హత్య చేసిందని న్యాయస్థానం నిర్ధారించింది. 2018లో ఆమెపై హత్యారోపణలు రుజువు కావడంతో యెమన్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే మానవ హక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం సంప్రదించినా యెమన్ ప్రభుత్వం అంగీకరించలేదు.
రద్దు చేయాలంటే...?
యెమన్ లో బ్లడ్ మనీ చట్ట ప్రకారం చాధిత కుటుంబం శిక్షను రద్దు చేయాలనుకుంటే నష్టపరిహారం చెల్లింపుతో శిక్షను నిలుపుదల చేయవచ్చు. కానీ తలాల్ అబ్దో మహది కుటుంబం మాత్రం క్షమాబిక్ష కోసం ముందుకు రాకపోవడంతో ఉరి శిక్షను అమలు చేయాలని యెమన్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ నెల 16న నిమిష ప్రియను ఉరితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జులై 16వ తేదీన మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News