గుంటూరులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం, హత్య

తిరుపతమ్మ ఇంట్లో విగతజీవురాలిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో

Update: 2022-04-28 04:51 GMT

గుంటూరు : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటన మరువకుండానే.. గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లాడు. వీరిది ఇద్దరు సంతానం.

బుధవారం సాయంత్రం తిరుపతమ్మ ఇంట్లో విగతజీవురాలిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు, దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. అక్కడున్న ఆనవాళ్లను బట్టి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతమ్మకు తెలిసినవారే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు స్పందించారు. మహిళపై దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులు బాధితురాలిపట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో ఘటనా ప్రాంతాన్ని చూస్తే తెలుస్తోందని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




Tags:    

Similar News