ఐ ఫోన్ కు డబ్బుల్లేక.. డెలివరీ బాయ్ హత్య

ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ పట్టణంలో ..

Update: 2023-02-20 09:09 GMT

karnataka crime news

టెక్నాలజీ పెరిగింది. మనకి ఏం కావాలన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు. మన ఇంటికే వచ్చేస్తుంది. మనం తినే ఆహారం నుండి.. నిత్యావసరాలు, ఇంట్లో వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇలా చాలా వరకూ డోర్ డెలివరీకి అవైలబుల్ గా ఉన్నాయి. అలా ఓ 20 ఏళ్ల కుర్రాడు ఫ్లిప్ కార్ట్ లో యాపిల్ ఐ ఫోన్ ను ఆర్డర్ చేశాడు. ఆన్లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టాడు. ఇచ్చిన టైమ్ ప్రకారం.. ఈ కార్ట్ డెలివరీ బాయ్ ఐఫోన్ ను లొకేషన్ కు తీసుకెళ్లాడు. అయితే.. డబ్బులు చెల్లించి ఫోన్ తీసుకోవాల్సిన యువకుడు.. తన వద్ద డబ్బులేకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.

డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఈ-కార్ట్ బాయ్ ను చంపేశాడు. నాలుగు రోజులపాటు మృతదేహాన్ని తన ఇంట్లోనే రహస్యంగా ఉంచి.. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ పట్టణంలో చోటుచేసుకుంది. అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11న కాలిన శరీరం వెలుగు చూడడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుడు హేమంత్ నాయక్ (23)గా గుర్తించారు. అతనొక ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగి అని తెలిసింది. లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను బుక్ చేసుకోగా, దాన్ని డెలివరీ చేసేందుకు ఈ నెల 7న హేమంత్ నాయక్ వెళ్లాడు. రూ.46,000 చెల్లించాలని నాయక్ కోరగా.. దత్తా తనవద్ద డబ్బులేక హేమంత్ పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేసినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. నిందితుడైన దత్తాను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News