గుంతలో పడిన పిల్లలు.. వారిని కాపాడబోయి ?

బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ..ఆడుకుంటూ.. గుంతలు తవ్వినవైపుగా వెళ్లి.. ప్రమాద వశాత్తు..

Update: 2023-05-31 13:50 GMT

గుంతలో పడిన ఇద్దరు పిల్లల్ని రక్షించబోయి వాళ్లిద్దరి తల్లులు మృతి చెందారు. ఈ విషాద ఘటన నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వాలు. బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ..ఆడుకుంటూ.. గుంతలు తవ్వినవైపుగా వెళ్లి.. ప్రమాద వశాత్తు వాటిలో పడిపోయారు. ఈ విషయం గమనించిన తల్లులు షాహీనా, షబీనా పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ గుంతల్లో దూకారు. చిన్నారులను కాపాడిన అనంతరం ఇద్దరు తల్లులు పైకి రాలేక.. ఆ గుంతల్లోని బురదలో చిక్కుకుపోయి మరణించారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పైకి తీయించారు. వివరాలు నమోదు చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. కొంతకాలంగా రివిట్ మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతలు తవ్వి.. వాటి వద్ద ఎలాంటి హెచ్చరికలు, రక్షణ లేకపోవడం, నిర్మాణంలో జాప్యం కారణంగా ఇద్దరు తల్లులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు వాపోయారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News