నెల్లూరులో ఘోర రైలు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్ మెంట్ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు లభించిన ఫోన్ నంబర్ కు..

Update: 2023-01-22 05:47 GMT

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గూడూరు నుండి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుల వయసు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు పట్టాలపైనే చనిపోగా.. మహిళ బ్రిడ్జిపై నుండి కిందపడి మృతి చెందింది. పట్టాలపై ఉన్న సదరు మహిళను రక్షించే క్రమంలో.. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కాగా.. ప్రమాద సమయంలో వారిచేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్ మెంట్ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు లభించిన ఫోన్ నంబర్ కు పోలీసులు ఫోన్ చేయగా.. ఎలాంటి స్పందన లేదని పోలీసులు తెలిపారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేక వేర్వేరు కుటుంబాలకు చెందినవారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న సంచులలో విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఉన్న గుర్తింపు కార్డు కూడా లభించింది. అందులోని ఫొటో ఆధారంగా మృతుల్లో ఆయన కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News