నదిలో కుప్పలుగా చిన్నారుల మృతదేహాలు.. విచారణలో ఏం తేలిందంటే..

గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు

Update: 2022-11-24 05:32 GMT

ఆడజన్మ అమ్మ అవడంతో.. సార్థకం అవుతుందంటారు. అప్పుడే పరిపూర్ణమైన మహిళగా చూస్తారు. కానీ.. ఈ రోజుల్లో కడుపులో పిండం పడిందంటే చాలు. అపురూపంగా చూసుకునే వారికంటే.. కడుపులో ఉండగానే కడతేర్చేసే తల్లులెందరో ఉన్నారు. అందుకు కారణాలేవైనా.. పిల్లలు వద్దనుకుంటే ముందుగా జాగ్రత్తపడాలి.. అంతేగానీ కడుపులో బిడ్డ ఉసురు తీయడం మహాపాపం. కన్న తర్వాత బిడ్డను వదిలించుకోవడం .. అంతకన్నా ఎక్కువ. అలాంటి చిన్నారుల అవశేషాలు, మృతదేహాలు ఓ నది వద్ద కనిపించడం పెను సంచలనం రేపింది. మహారాష్ట్రలోని వాన్ నదీతీరంలో ఈ ఘటన వెలుగుచూసింది.

గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన చిన్నారులను నదిలో వదిలేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. దాంతో గ్రామస్తులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు తెలిశాయి. పెద్దఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ మొదలైనట్లు నిర్ధారించారు.
గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి చనిపోయిన శిశువుల అవశేషాలను నదిలో పడేస్తున్నారని వాపోతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడైనా.. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయక పోవడం గమనార్హం. త్వరలోనే ఆ ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.


Tags:    

Similar News