ఎస్సై లవ్ ట్రాప్.. ముగ్గురితో.! మోసపోయానని యువతి ఆత్మహత్య

పోలీసు అధికారి చేతిలో మోసపోయిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2022-05-07 08:32 GMT

others

కంచే చేను మేసిందన్న చందంగా వ్యవహరించాడో పోలీసు అధికారి. మహిళలకు అండగా నిలబడాల్సిన ఓ ఎస్సై యువతులకు ప్రేమ పేరుతో వల విసిరాడు. ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పెళ్లి చేసుకున్నాడు. మరో యువతిని ప్రేమ పేరుతో వంచించాడు. తీరా విషయం తెలిసిన యువతి మోసపోయానని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

పామిడి మండలం జీఏ కొట్టాలకు చెందిన యువతి తిరుపతిలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రమావత్ విజయకుమార్ నాయక్ చంద్రగిరిలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ యువతికి దగ్గరయ్యాడు. అతని వలలో చిక్కిన ఆమె నిజమేనని నమ్మేసింది. తీరా పెళ్లి చేసుకోమని కోరడంతో విజయ్ కుమార్ నిజస్వరూపం బయటపడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

ఎస్సై చేతిలో మోసపోయానని తీవ్ర మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పామిడి పోలీసులు ఎస్సై విజయ్ కుమార్‌ నాయక్‌పై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.

అయితే గతంలోనే అనంతపురానికి చెందిన మరో యువతితో ఎస్సై ప్రేమాయణం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. తనను మోసం చేశాడంటూ ఆమె దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నుంచి తప్పించుకునేందుకు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆ ఇద్దరే కాకుండా మరో యువతిని కూడా ఎస్సై ప్రేమపేరుతో వంచించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖాకీ సర్వీసులో చేరక ముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసేవాడని.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేశాడనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

Tags:    

Similar News