ప్రాణం తీసిన కబడ్డీ.. ఇంటర్ విద్యార్థి మృతి

కబడ్డీ ఆడుతుండగాప్రమాద వశాత్తూ తలకు గాయమవ్వడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది

Update: 2021-12-14 09:17 GMT

తోటి స్నేహితులతో ఓ విద్యార్థి సరదాగా కబడ్డీ ఆడగా.. అదే అతని పాలిట శాపమైంది. కబడ్డీ ఆడుతుండగా.. ప్రమాద వశాత్తూ తలకు గాయమవ్వడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దముప్పారం గ్రామంలో ఐలయ్య - మంజుల దంపతులు నివాసముంటున్నారు. కుమారుడు సంతోష్ హసన్ పర్తి మండలంలోని జయగిరి శివారులో ఉన్న బీసీ సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీన సంతోష్ తాను చదువుతున్న కాలేజీ ఆవరణలో తోటి మిత్రులతో కలిసి కబడ్డీ ఆడాడు.

తలకు బలమైన....
ఈ క్రమంలో కిందపడిన సంతోష్ తలకు బలమైన గాయమయింది. రక్తస్రావం అవ్వడంతో.. కళాశాల సిబ్బంది సంతోష్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. సంతోష్ తలలో రక్తం గడ్డ కట్టడంతోనే మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంతోష్ ఆకస్మిక మరణంతో ఇటు కళాశాలలో , అటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News