గుంటూరులో దారుణం.. నడిరోడ్డుపై రౌడీ షీటర్ హత్య

స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు..మృతుడు నల్లచెరువు ఆరోలైన్ కు చెందిన

Update: 2022-10-19 02:44 GMT

rowdy sheeter ramesh murder

గుంటూరులో దారుణ ఘటన జరిగింది. గతరాత్రి అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడిని వెంటాడి కత్తులు, వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగులు. ఈ ఘటన చూసిన అక్కడి ప్రజలంతా భయంతో వణికిపోయారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు బాధిత యువకుడు ఓ కిరాణా షాపులోకి వెళ్లి దాక్కోగా.. బయటకు ఈడ్చుకుని వచ్చి మరీ నరికి చంపారు. ఈ ఘటన పట్నంబజార్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద గత రాత్రి 8 గంటల సమయంలో జరిగింది.

స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు..మృతుడు నల్లచెరువు ఆరోలైన్ కు చెందిన దొడ్డి రమేశ్ (38)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రమేశ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. దానితోపాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు కూడా చేస్తుంటాడు. రమేశ్ ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. హత్యకు ముందు వరకు రమేశ్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానం చేసేందుకు వెళ్తుండగా ఏదో ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లినట్లు అతని తల్లి పేర్కొంది. తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీ షీటర్ ఆర్కే హత్య చేశాడని రమేశ్ భార్య లత ఆరోపించింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రమేశ్ ను ఎందుకు చంపారు ? అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


Tags:    

Similar News