కువైట్ లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వాళ్లు దుర్మరణం

కువైట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు

Update: 2023-08-26 05:19 GMT

కువైట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను గౌస్‌బాషా (35), ఆయన భార్య (30), ఇద్దరు కుమారులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

గౌస్‌బాషా (35)తో పాటు అతని భార్య (30), ఇద్దరు కుమారులు కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుస్తోంది. గౌస్‌బాషా రాజంపేటలోని ఎగువగడ్డలోని స్థానిక పాఠశాలలో టెన్త్‌ వరకు చదివాడు. ఆ తర్వాత మదనపల్లెకు వెళ్లాడు గౌస్‌బాషా. అక్కడే ఉండి కొన్నేళ్ల తర్వాత బెంగళూరులో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం గౌస్‌బాషా అక్కడే స్థిరపడ్డాడు. బెంగళూరు నుంచి బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లాడు గౌస్‌బాషా. అక్కడ కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో గౌస్‌బాషాతో పాటు అతని భార్య ఇద్దరు కుమారులు మరణించారు. అయితే కువైట్ లోని వ్యక్తుల నుండి సరైన సమాచారం రావడం లేదని బంధువులు చెబుతున్నారు. స్వగ్రామానికి వారి మృతదేహాలను తీసుకొచ్చేలా చూడాలని బంధువులు కోరుతున్నారు.


Tags:    

Similar News