అయ్యో చిట్టితల్లీ.. ఆ పాపను చంపడానికి మనసెలా వచ్చిందిరా !

ప్రస్తుతం కూర్మన్నపాలెం మంగళపాలెంలోని జేఎన్ఎన్.యుఆర్ఎం కాలనీలో స్నేహ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది.

Update: 2023-07-23 11:10 GMT

17 months baby murder

చిన్నపిల్లలు ఏం చేసినా చూడముచ్చటేస్తుంటుంది. వాళ్ల అల్లరిని చూస్తూ చాలా మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సమస్యలన్నీ మరిచిపోయి మురిసిపోతుంటారు. బుడిబుడి అడుగులేస్తూ.. వచ్చీరాని మాటలతో.. ఎంత క్యూట్ గా ఉంటారో కదూ. అలాంటి ఓ చిట్టితల్లిని.. తల్లి గరిటెతో కొట్టగా.. ఆమె ప్రియుడు గోడకేసి బాది దారుణంగా చంపేశారు. అందుకు కారణం తెలిస్తే.. వాళ్లని చంపినా తప్పులేదంటారు. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా.. కామం. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంతో 17 నెలల చిన్నారి గీతశ్రీ ఏడుస్తుందని ఆ తల్లి గరిటెతో తలపై కొట్టింది. కాసేపటికి చిన్నారి నొప్పి భరించలేక ఏడుస్తుంటే.. ప్రియుడు గోడకేసి కొట్టి చంపేశాడు. ఈ అమానవీయ ఘటన అనకాపల్లి జిల్లా కూర్మన్నపాలెంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఎలమంచిలికి చెందిన సాయి.. గాజువాకకు చెందిన స్నేహను ప్రేమించి 2020లో పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత పొట్టకూటికోసం ఇద్దరూ విజయవాడ వెళ్లారు. అక్కడ వారికాపురం అన్యోన్యంగానే సాగింది. 2022 మార్చిలో వీరికి పాప పుట్టింది. ఆ పాపకు గీతశ్రీ అని నామకరణం చేశారు. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న వీరి మధ్య ఒక్కసారిగా కలహాలు మొదలయ్యాయి. ఇక కలిసి ఉండలేమని.. తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. చిన్నారి గీతశ్రీ.. తల్లి స్నేహవద్దే ఉంటోంది. భర్తకు దూరంగా ఉంటున్న స్నేహకు రమణబాబు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది.
ప్రస్తుతం కూర్మన్నపాలెం మంగళపాలెంలోని జేఎన్ఎన్.యుఆర్ఎం కాలనీలో స్నేహ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ క్రమంలో రమణబాబుతో చనువుగా ఉండగా.. గీతశ్రీ అల్లరి చేస్తుండటంతో.. గరిటతో తలపై కొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆ చిన్నారి అల్లాడిపోయింది. వెంటనే పసుపు రాయగా.. కొద్దిసేపటికి నిద్రపోయింది. నిద్రలేచాక గీతకు స్నేహ అన్నం తినిపిస్తుండగా.. తలపై తగిలిన గాయం మళ్లీ నొప్పి రావడంతో.. ఏడుపందుకుంది. అక్కడే ఉన్న ప్రియుడు ఆ చిన్నారి ఏడుపుకి కోపంతో.. ఊగిపోయి చిన్నారి పాప అన్న కనికరం, విచక్షణ లేకుండా గోడకేసి కొట్టాడు. విచక్షణా రహితంగా చిన్నారిని కొట్టడంతో.. స్పృహ కోల్పోయి, ప్రాణం విడిచింది.
ఈ విషయం నలుగురికీ తెలిస్తే.. తమనే నిందితులుగా భావిస్తారని భయపడి ఇంటి వెనుకో గొయ్యితీసి.. గీతశ్రీని పూడ్చిపెట్టారు. ఇదంతా జులై 17న జరిగింది. ఆ తర్వాత ఇంటికొచ్చిన స్నేహ తండ్రి.. పాప గురించి ఆరాతీయగా పొంతనలేని సమాధానాలిచ్చింది. ఓసారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక అమ్మేశానని, మరోసారి మరో కథ ఇలా రకరకాలుగా చెప్పడంతో తండ్రికి అనుమానం కలిగింది. ఇంటివెనుక నుంచి దుర్వాసన వస్తుండటంతో..స్నేహను గట్టిగా నిలదీయగా అసలు విషయం చెప్పింది. అప్పటికే వీధి కుక్కలు మృతదేహాన్ని బయటకు లాగినట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దువ్వాడ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రమణ, స్నేహలపై కేసు నమోదు చేసి.. రిమాండ్ తరలించారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల వారు అభం శుభం ఎరుగని, ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని పొట్టనపెట్టుకున్న వారిద్దరినీ ఉరితీసినా తప్పలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


Tags:    

Similar News