Nalgonda: భర్త హత్య.. అలా బయటపడిన బావా మరదళ్ల బాగోతం

Update: 2022-09-05 09:39 GMT

వివాహేతర సంబంధాల మోజులో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. కట్టుకున్న వారిని కర్కశంగా కడతేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. క్షణికమైన సుఖం కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. బావతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన దారుణ ఘటన ఒకటి నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సుపారీ గ్యాంగ్‌తో పని పూర్తి చేయించి నాగార్జున సాగర్ నీళ్లలో పడేసి చేతులు దులుపుకున్నారు. అయితే అతని ఫోన్ కాల్ డేటా నిందితులను పట్టించడంతో బావ, మరదళ్ల బాగోతం బయటపడింది.

మిర్యాలగూడ మండలం తుంగపాడుకి చెందిన లావుడ్య రాగ్య(32)కి అదే జిల్లా ఊరబావితండాకు చెందిన రోజాతో పన్నెండేళ్ల కిందట వివాహమైంది. ఉపాధి కోసం రాగ్య కుటుంబం హైదరాబాద్ నగరానికి వలస వెళ్లింది. రాగ్య కారుడ్రైవర్‌గా పనిచేస్తూ మణికొండ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఇబ్రహీంపట్నంకి చెందిన లక్పతి వరుసకి రోజాకి బావ అవుతాడు. కొద్దికాలంగా ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. తమ ఏకాంతానికి భర్త రాగ్య అడ్డుగా ఉన్నాడని భావించిన రోజా, లక్పతి ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. సుపారీ ఇచ్చి రాగ్యను హత్య చేయించేందుకు పూనుకున్నారు.

నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాకి చెందిన బాలాజీ, మాన్‌సింగ్‌తో ప్రియుడు లక్పతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాగ్యని హతమారిస్తే రూ.20 లక్షలు చెల్లించేలా డీల్ కుదిరింది. చేపల వ్యాపారం చేసే బాలాజీ, మాన్ సింగ్ తరచూ ఫోన్ చేస్తూ కారుడ్రైవర్ రాగ్యతో పరిచయం పెంచుకున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అతన్ని గత నెల 19న దారుణంగా హతమార్చారు. నేరేడుగొమ్మ మండల పరిధిలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో అతని శవాన్ని పడేశారు. పైకి తేలకుండా ఉండేందుకు ఇనుప చువ్వలు కట్టి మరీ పడేసినట్లు తెలుస్తోంది.

అలా బయటికి..

అయితే కొద్దిరోజులుగా రాగ్య కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. కనిపించకుండా పోయిన రోజు ముందు నుంచి రాగ్య ఫోన్ కాల్ డేటా బయటికి తీయడంతో బాలాజీ, మాన్‌సింగ్ దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు విషయం కక్కేశారు. రూ.20 లక్షలు సుపారీ ఇస్తామన్నారని చెప్పడంతో లక్పతి, రోజా అనైతిక సంబంధం బయటపడింది. ప్రియుడి మోజులో భర్తను కట్టుకున్న భార్యే కిరాతకంగా హత్య చేయించనట్లు తేలింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News