Bengaluru : బెంగళూరు హత్య కేసులో ట్విస్ట్.. ఆమె కోసం భార్యను చంపేశాడు
బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన డాక్టర్ కృతికా రెడ్డి మరణించారు. అనారోగ్యంతో చనిపోయిందని ఆమె భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా వైద్యుడే.. వైద్య పరీక్షల్లో మత్తు మందు ఓవర్ డోస్ వల్లే చనిపోయిందని తేలడంతో కృతికా రెడ్డిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు నెలల తర్వాత కృతికా రెడ్డిని ఆమె భర్త మహేంద్రారెడ్డి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 15న మహేంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ హత్య కేసులో సంచలన ఘటనలు వెలుగు చూశాయి.
అనారోగ్యానికి గురైన...
అనారోగ్యానికి గురైన కృతికారెడ్డికి ఇంట్లోనే చికిత్స మహేంద్రారెడ్డి అందించాడు. మత్తుమందును అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. దీంతో కృతికా రెడ్డి మరణించింది. కృతిక చనిపోయిందని నిర్ధారించుకున్న డాక్టర్ మహేంద్రారెడ్డి తన ప్రియురాలికి మెసేజ్ చేశాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశాను’ అంటూ ఓ డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. వాట్సాప్, మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తే పోలీసులకు దొరికిపోతానని అతితెలివిగా డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిపై మహేంద్రా రెడ్డి ప్రియురాలిని ప్రశ్నించి, ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. పోలీసులు ఇప్పటికే మహేంద్రారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.