సెల్ఫోన్ చూడొద్దని మందలించిన తల్లి.. కూతురు ఆత్మహత్య

తల్లి తిట్టడంతో.. సెల్ఫోన్ ఆపి పడుకుంటానని చెప్పిన వాణిశ్రీ.. ఇంటిపైన ఉన్న గదిలోకి వెళ్లింది. కూతురు పడుకుంది అనుకున్నారు

Update: 2022-03-06 06:52 GMT

తిరుపతి : క్షణికావేశంలో యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంట్లో తిట్టారని, సినిమాకు డబ్బులివ్వలేదనో, ఫోన్లో గేమ్స్ ఆడనివ్వలేదనో.. ఇలా చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలలో కుంకుమ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోన్న బాలాజీ తన కుటుంబంలో కలిసి కొర్లగుంట ప్రాంతంలోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. బాలాజీ కుమార్తె వాణిశ్రీ (16) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి చాలా సేపు వాణిశ్రీ సెల్ఫోన్ చూస్తూ ఉంది. ఆ విషయాన్ని గమనించిన తల్లి.. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదంటూ ఆమెను తల్లి మందలించింది.

తల్లి తిట్టడంతో.. సెల్ఫోన్ ఆపి పడుకుంటానని చెప్పిన వాణిశ్రీ.. ఇంటిపైన ఉన్న గదిలోకి వెళ్లింది. కూతురు పడుకుంది అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ.. పైన గదిలోకి వెళ్లిన వాణిశ్రీ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వాణిశ్రీ గదిలోకి వెళ్లిన తల్లిదండ్రులు.. ఆమె ఉరికి వేలాడటం చూసి.. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. తిరుపతి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News