మారిపోయానని నమ్మించి.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు

కువైట్ నుండి వచ్చిన నిర్మల.. పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెలల క్రితం జైలు నుండి విడుదలైన దావీదు..

Update: 2023-04-28 06:44 GMT

husband brutally kills wife

భార్య భర్తలన్నాక గొడవలు సహజం. అవి టీ కప్పులో తుఫానులా వచ్చిపోవాలే గానీ.. జీవితాలను పాడుచేసుకునేంతవి అవకుండా జాగ్రత్త పడాలి. ఇద్దరిలో తప్పెవరిదైనా ఆ ఇద్దరితో పాటు కడుపున పుట్టిన పిల్లల జీవితాలు కూడా రోడ్డు పాలవుతాయి. ఓ భర్త తాను పూర్తిగా మారిపోయానని నమ్మించి మరీ కాపురానికి తీసుకొచ్చాడు. అదే రోజు భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజి దావీదు- నిర్మల (30) దంపతులు. వీరికి పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. కొంతకాలంగా ఇద్దరికీ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మల తన పిల్లలను పుట్టింట్లో ఉంచి.. కుటుంబ పోషణకై ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆ తర్వాత దావీదు మద్యానికి బానిసయ్యాడు. తన అవసరాలకు నిర్మల డబ్బు పంపకపోవడంతో.. కుమార్తెలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు రికార్డ్ చేసి వాటిని ఆమెకు పంపాడు. కుమార్తెలను చిత్రహింసలు చేస్తున్న వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దావీదును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
కువైట్ నుండి వచ్చిన నిర్మల.. పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెలల క్రితం జైలు నుండి విడుదలైన దావీదు.. తాను పూర్తిగా మారిపోయానని, తనతో కలిసి ఉండాలని, రోజూ పనిచేసి పోషిస్తానని నమ్మబలికాడు. తనతో కలిసి ఉండాలని బతిమాలాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన భార్య మూడ్రోజుల క్రితం భర్తతో కలిసి వీరంపాలెంకు వచ్చింది. ఈ క్రమంలో గురువారం (ఏప్రిల్ 27) రాత్రి మళ్లీ గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దావీదు భార్యపై అతి క్రూరంగా దాడి చేశాడు. నిర్మల మెడ, చేయి కోసేసి, తలను రెండు ముక్కలుగా నరికేశాడు. నరికిన చేతిని మరో చేతిలో పెట్టి సైకోలా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ బండారు శ్రీనాథ్, తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిందితుడైన దావీదును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News