దారుణం.. రుణాలు తీర్చలేదని అమ్మకానికి బాలికలు, గృహిణులు

హిందీ జాతీయ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. భిల్వారా తదితర ప్రాంతాల్లోని కొన్ని కులాల ప్రజలు వివాదాల పరిష్కారానికి..

Update: 2022-10-28 11:22 GMT

rajasthan girls sold

కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పును నిర్ణీత గడువులోగా చెల్లించలేకపోతే.. బదులుగా కుటుంబంలోని బాలికలు లేదా.. గృహిణులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు రాజస్థాన్లో రాజ్యమేలుతున్నాయి. అప్పు తీర్చకపోతే బాలికలను అమ్మాలని, గృహిణులను రేప్ చేయాలని కుల పంచాయతీ పెద్దలు జారీ చేస్తున్న దారుణ తీర్పుల వ్యవహారాన్ని హిందీ జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ బయటపెట్టింది. ఈ కథనంపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై నోటీసు జారీ చేసింది.

హిందీ జాతీయ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. భిల్వారా తదితర ప్రాంతాల్లోని కొన్ని కులాల ప్రజలు వివాదాల పరిష్కారానికి పోలీసుల వరకు వెళ్లకుండా కుల మండళ్లను ఆశ్రయిస్తున్నారు. అదే వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఒక కేసులో రూ.15 లక్షల రుణం చెల్లించనందుకు సోదరిని విక్రయించాలంటూ కుల పెద్దలు ఆదేశించారు. ఆ తర్వాత అతడి 12 ఏళ్ల బాలికను కూడా వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికలను విక్రయించని నేపథ్యంలో వారి తల్లులపై అత్యాచారం చేయవచ్చని దారుణంగా తీర్పులిస్తున్నట్లు కథనంలో పేర్కొంది.
ఓ వ్యక్తి తన భార్య చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు తీసుకుని తిరిగి చెల్లింలేకపోయాడు. దాంతో అతడి కూతుర్ని రూ.6 లక్షలకు విక్రయించగా.. కొనుగోలుదారులు ఆమెను ఆగ్రా తీసుకెళ్లారు. ఆ తర్వాత మూడు విడతలుగా ఆమె విక్రయానికి గురైంది. నాలుగుసార్లు గర్భందాల్చింది. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇవి అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. కొనుగోలు చేసిన బాలికలను విదేశాలకు కూడా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ నాలుగు వారాల్లోగా చర్యల నివేదికను తమకు సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.


Tags:    

Similar News