APSRTC : పల్లెవెలుగు బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు

మంటలు చెలరేగడంతో బస్సు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేశారు. దాంతో వారి వస్తువులు..

Update: 2022-10-21 06:14 GMT

fire broke in pallevelugu bus

కృష్ణాజిల్లా పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుండి గుడివాడ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిపి మొత్తం 40 మంది బస్సులో ఉన్నారు. బస్సులో ఉన్న ఇంజిన్ నుండి మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును ఆపి కిందికి దిగేశాడు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కూడా కిందికి దిగగా.. మంటలు పెద్దవయ్యాయి.

మంటలు చెలరేగడంతో బస్సు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేశారు. దాంతో వారి వస్తువులు, దుస్తులు, నగదు వంటివి కాలిపోయినట్లు వాపోయారు. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని సిబ్బంది.. ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News