ప్లాస్మా పేరుతో పళ్లరసం ఎక్కించారు.. డెంగ్యూ పేషంట్ మృతి

వ్ర జ్వరంతో బాధపడుతున్న 32 ఏళ్ల యువకుడిని బంధువులు ప్రయాగ్ రాజ్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు.

Update: 2022-10-21 05:04 GMT

prayagraj global hospital

డెంగ్యూ బారిన పడిన వారికి శరీరంలో ప్లెట్లెట్స్ సంఖ్య తగ్గడం సహజం. ప్లేట్లెట్స్ తగ్గిన పేషంట్స్ కి మళ్లీ వాటిని ఎక్కించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూతో బాధపడుతున్న పేషంట్ కి ప్లేట్లెట్స్ పేరుతో వైద్యులు పళ్లరసం ఎక్కించారు. దాంతో పేషంట్ ఆరోగ్య పరిస్థితి విషమించి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. బాధిత వ్యక్తి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయాడంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో.. అధికారులు ఆ ఆస్పత్రికి సీల్ వేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 32 ఏళ్ల యువకుడిని బంధువులు ప్రయాగ్ రాజ్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ యువకుడు డెంగ్యూతో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చారు. రక్తంలో ప్లేట్లెట్ల స్థాయి పడిపోతుండటంతో అతనికి ప్లాస్మా ఎక్కించాలని రోగి బంధువులకు చెప్పి.. తగిన ఏర్పాట్లు చేశారు. ఐదు యూనిట్ల ప్లాస్మా తెప్పించి రోగికి ఎక్కించడం మొదలుపెట్టారు. ఇంతలోనే రోగి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో రోగిని బంధువులు మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు, ప్లాస్మా పేరుతో పళ్లరసం ఎక్కించడం వల్లే రోగి ప్రాణాలు కోల్పోయాడని అక్కడి వైద్యులు తెలిపారు.
దాంతో ఆగ్రహానికి గురైన రోగి బంధువులు.. గ్లోబల్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీస్తూ తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బంధువు ప్రాణాలు పోవడానికి కారణమైన గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలపై యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్లాస్మా ప్యాకెట్లను పరీక్ష కోసం పంపించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాగా.. రోగికి చికిత్స చేయడంలో తమ తప్పేమీ లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రోగికి కావలసిన 5 యూనిట్ల ప్లాస్మాను.. బంధువులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని తెలిపాయి. మూడు యూనిట్ల ప్లాస్మా ఎక్కించగానే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఆపేశామని పేర్కొంది.



Tags:    

Similar News