ఫ్రీజర్ లో ప్రియురాలి మృతదేహం కేసులో.. షాకింగ్ నిజాలు

దీంతో ఆమెకు నచ్చజెప్పేందుకు అదే రోజు రాత్రి ఆమె ఫ్లాట్‌కు వచ్చాడు. తెల్లవారుజామున ఇద్దరూ కలిసి కారులో ఢిల్లీ..

Update: 2023-02-16 05:08 GMT

ఢిల్లీలో ఓ యువతిని తన ప్రియుడే హత్య చేసి.. ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కేసులో.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడైన సాహిల్ గహ్లోత్.. బాధిత యువతి నిక్కీ యాదవ్ మెడకు చార్జింగ్ వైరు బిగించి కారులోనే హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిక్కీ యాదవ్ పోస్టుమార్టం రిపోర్టులోనూ.. ఇదే వెల్లడైంది. నిక్కీని హత్య చేసిన అనంతరం.. తన పక్కసీటులోనే కూర్చోపెట్టుకుని సాహిల్ దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిసింది. అనంతరం దక్షిణ ఢిల్లీలోని తన దాబాలోని ప్రీజర్‌లో నిక్కీ శవాన్ని దాచిపెట్టాడు.

తమ కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. నిక్కీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 14న నిక్కీ శవాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో గుర్తించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో నిక్కీ, సాహిల్ ప్రేమలో ఉన్నట్టు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాహిల్ నిందితుడని తేలిన తర్వాత అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీ అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
సాహిల్, నిక్కీ లు ఒకరికొకరు ఒక కోచింగ్ సెంటర్ ద్వారా పరిచయమయ్యారు. ప్రతిరోజూ ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణించేవారు. వారిద్దరి మధ్యన స్నేహం ప్రేమగా మారి.. సహజీవనానికి దారితీసింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ సాహిల్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పకపోవడంతో.. అతడికి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి చేశారు. ఎలాగైనా నిక్కీ అడ్డు తొలగించుకోవాలని భావించాడు సాహిల్. ఈ నెల 9న నిందితుడు సాహిల్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన నిక్కీ ప్రశ్నించింది.
దీంతో ఆమెకు నచ్చజెప్పేందుకు అదే రోజు రాత్రి ఆమె ఫ్లాట్‌కు వచ్చాడు. తెల్లవారుజామున ఇద్దరూ కలిసి కారులో ఢిల్లీ అంతా తిరిగారు. ఈ క్రమంలో నిక్కీ మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో కారులోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇలాగైతే లాభం లేదనుకున్న సాహిల్ మొబైల్ చార్జింగ్ కేబుల్‌ను నిక్కీ మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి తన దాబాలోని ఫ్రీజర్‌లో పడేశాడు. ఆ మరుసటిరోజున పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నాడు. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధిత యువతి నిక్కీ యాదవ్ అపార్ట్‌మెంట్ పైఅంతస్తులోకి వెళ్లి తిరిగి రాత్రి 9 గంటల సమయంలో బయటకు వస్తున్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సాహిల్ తరచూ ఆ ఫ్లాట్‌కు వచ్చిపోతుండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.



Tags:    

Similar News