బ్యాంకు మేనేజర్ ను కాల్చి చంపిన తీవ్రవాదులు..!

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి గురించి చర్చించడానికి జూన్ 3 న హోం మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశానికి

Update: 2022-06-02 08:02 GMT

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో మూడు రోజుల్లో మరో వ్యక్తిని తీవ్రవాదులు కాల్చి చంపారు. లోయలో హిందువులపై జరిగిన రెండవ దాడిలో నాన్ లోకల్ బ్యాంకు మేనేజర్ ను కాల్చి చంపారు. రాజస్థాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఎలాఖాహి దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్‌పై ఉగ్రవాదులు ఈరోజు అరేహ్ బ్రాంచ్‌లో దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా నివాసి అయిన కుమార్ కు ఇటీవల కుల్గాంలో పోస్టింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. జమ్మూకి చెందిన రజనీ బాలా అనే హిందూ ఉపాధ్యాయిని కుల్గామ్‌లో పాఠశాల వెలుపల ఉగ్రవాదులు చంపిన రెండు రోజులకే ఈ దాడి చోటు చేసుకుంది.

ఇటీవలి కాలంలో కశ్మీర్ లో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. షోపియాన్ జిల్లాలో ఫరూఖ్ అహ్మద్ షేక్ అనే పౌరుడు నిన్న సాయంత్రం తన ఇంటిలో జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డాడు. మరో సంఘటనలో, ఈ తెల్లవారుజామున పేలుడు కారణంగా ముగ్గురు సైనికులు గాయపడ్డారు. సైనికుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు సైనికులు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం ఒక ప్రైవేట్ వాహనాన్ని తీసుకున్నారు. ఓ ప్రాంతానికి వెళ్తుండగా పేలుడు సంభవించిందని వారు తెలిపారు.
కశ్మీర్‌లో పనిచేస్తున్న హిందూ సమాజానికి చెందిన ప్రజలు జమ్మూలో నిరసనలు చేస్తున్నారు. తమ వర్గానికి చెందిన వారికి భద్రత కల్పించాలని హిందూ సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి గురించి చర్చించడానికి జూన్ 3 న హోం మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంత సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News