సినీఫక్కీలో పోలీసుల కళ్లలో కారంకొట్టి.. నిందితుడి హత్య

ఇద్దరినీ భరత్ పుర్ లోని కోర్టులో హాజరు పరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణా సంస్థకు చెందిన బస్సులో..

Update: 2023-07-12 13:34 GMT

kuldeep jaghina and kripal jaghina

హత్యకేసులో నిందితుడిని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులను అడ్డుకున్న ఓ ముఠా.. సినీ ఫక్కీలో వారి కళ్లలో కారంకొట్టి నిందితుడిని కాల్చి చంపింది. ఈ కాల్పుల్లో ఒక నిందితుడు చనిపోగా.. మరో నిందితుడికి తీవ్రగాయాలయ్యాయి. రాజస్థాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ జఘీనా, క్రిపాల్ అనే వ్యక్తులు వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

ఇద్దరినీ భరత్ పుర్ లోని కోర్టులో హాజరు పరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణా సంస్థకు చెందిన బస్సులో తీసుకెళ్తున్నారు. హలేనా పీఎస్ పరిధిలో ఉన్న అమోలీ టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే కొందరు దుండగులు నిందితులను తీసుకెళ్తున్న పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. కారు, బైక్ లపై మొత్తం 12 మందికిపైగా వచ్చిన దుండగులు పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో కుల్దీప్ జఘీనా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో నిందితుడు క్రిపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్పీ మృదుల్ కచ్ఛావా, సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News