Murder Case : చెన్నైలో వ్యాపారవేత్త హత్య కేసు .. అక్కడ హత్య చేసి .. ఇక్కడ పడేసి
చెన్నైలో వ్యాపారవేత్త హత్య కేసు .. అక్కడ హత్య చేసి .. ఇక్కడ పడేసి
చెన్నైలో వ్యాపారవేత్త హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు.తమిళనాడులో ఓ హోటల్ వ్యాపారవేత్త హత్య కేసులో ఆండమాన్, నికోబార్ దీవులకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్లోని షాదీపూర్ ప్రాంతానికి చెందిన హోటల్ భాగస్వామి నయమత్ అలీ ని జూలైలో చెన్నైలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 3న తమిళనాడులోని తంబరం జిల్లా ఖిలంబత్తం పోలీస్స్టేషన్ అధికారులు, ఆందమాన్ పోలీస్ సహకారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.
వ్యాపార విభేదాలే...
పోలీసుల కథనం ప్రకారం, జూలై 27న వ్యాపార పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లిన అలీ అదే రోజు కనిపించకుండా పోయారు. అతని కుటుంబ సభ్యులు జూలై 28న పోర్ట్ బ్లెయిర్లోని ఆబర్డీన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాన్ని చెన్నైకి పంపి అన్వేషణ ప్రారంభించారు. చెన్నైలోని సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణలో అలీ ఎయిర్పోర్ట్ నుంచి వందలూరు ప్రాంతానికి వెళ్తున్నట్లు, అక్కడ ఓ విద్యార్థితో చివరిసారిగా కనిపించినట్లు తేలిందని సీనియర్ అధికారి తెలిపారు. ఆ విద్యార్థి ఇచ్చిన సమాచారంతో, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ముగ్గురు అనుమానితులను గుర్తించారని చెప్పారు. అనంతరం విచారణలో నయమత్ అలీని కారు లోపల ఊపిరాడకుండా చేసి చంపి, మృతదేహంతో కూడిన వాహనాన్ని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వద్ద వదిలేశారని పోలీసులు వెల్లడించారు. వ్యాపార విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.