బస్సుపై ఉగ్రదాడి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం

Update: 2023-12-03 02:50 GMT

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం నాడు ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. బస్సు గిల్గిట్ నుండి రావల్పిండికి వెళుతుండగా చిలాస్‌ ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడి తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.

ఈ దాడిలో మరణించిన ఎనిమిది మందిలో ఐదుగురిని ఇప్పటి వరకు గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ చిలాస్ ఆరిఫ్ అహ్మద్ తెలిపారు. మరో 26 మంది గాయపడ్డారని.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని, ఈ దాడిలో స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్‌లోని ఒక సిబ్బంది గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఎక్కువ మంది కోహిస్థాన్, పెషావర్, ఘిజర్, చిలాస్, రౌండు, స్కర్డు, మన్సెహ్రా, స్వాబి ప్రాంతాలకు చెందిన వారేనని.. సింధ్‌కు చెందిన ఒకరిద్దరు కూడా బస్సులో ఉన్నారని తెలిపారు. దాడి అనంతరం ఉగ్రవాదులు ఘటనా స్థలం నుంచి పాలిపోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని, ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.


Tags:    

Similar News