ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి

రాజస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఈరోజు ఉదయం జరిగింది.

Update: 2023-09-13 04:04 GMT

రాజస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఈరోజు ఉదయం జరిగింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోని హంత్రా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు పక్క ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతోనే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. దీంతో జైపూర్ - ఆగ్రా రహదారి రక్తసిక్తంగా మారింది.

మృతులంతా...
ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున ఆగి ఉన్న బస్సు వెనకాల వీరు ఉండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అతి వేగమే...
తెల్లవారు జామున బస్సు చెడిపోవడంతో ఆగిపోయింది. బస్సు డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తుండగా ప్రయాణికులు బస్సు వెనక నిల్చుని వేచి చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజస్థాన్ లోని పుష్కర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావన్ కు వెళుతున్నారు. మృతులంతా గుజరాత్ లోని భావనగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News