టిడిపి VS వైసిపి.. కొండపిలో ఉద్రిక్తత

టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి ..

Update: 2023-06-05 05:43 GMT

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవతవకలు జరిగాయని, ఎమ్మెల్యే డోలా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే టంగుటూరులోని వైసీపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకోగా.. సుమారు 350 మంది పోలీసులు అక్కడ మోహరించారు.

వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు టంగుటూరిలోని వరికూటి అశోక్ బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అశోక్ ఇంటి ముట్టడికి బయల్దేరగా.. 16వ నంబర్ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కొందరు పోలీసుల నుంచి తప్పించుకుని హైవేపై పరుగులు తీశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News