వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి

Update: 2023-09-04 09:33 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మరో నిందితుడు గజ్జల ఉదయకుమార్ రెడ్డి తో పాటు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 24న ఉన్నత న్యాయస్థానం వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్ రెడ్డి ఉన్నారు.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు. గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది.
2019 మార్చి 14న పులివెందులలోని తన నివాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.


Tags:    

Similar News