అలజడి సృష్టించేందుకే దుష్ప్రచారం

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అనారోగ్యం పాలయ్యారంటూ

Update: 2023-10-14 05:20 GMT

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అనారోగ్యం పాలయ్యారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. పలువురు టీడీపీ నేతలు ఆయనకు ఏదో అయిందంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ రాకపోయే సరికి టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ అధినేత ఆరోగ్యస్థితిపై రాజమహేంద్రవరం జైలు అధికారులు విడుదల చేసిన నివేదికను ఆయన ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. నెలరోజుల పాటు జైల్లో ఉన్న కారణంగా చంద్రబాబుకు విశ్రాంతి దొరికి కిలో బరువు పెరిగారని విజయసాయి రెడ్డి అన్నారు. ఇతరత్రా అనారోగ్యాలు కూడా పోయి సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారన్నారు. ఇది టీడీపీ దుష్ప్రచారాన్ని బయటపెట్టిందని అన్నారు.

చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత కోసం స్నేహ బ్యారెక్‌ను కేటాయించామని, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏ ఖైదీ కూడా ఉండరన్నారు. ఆయన భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి నిత్యం ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్నారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారన్నారు. ఆయన ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జీజీహెచ్ డాక్టర్‌తో జైల్లోనే వైద్యం చేయించామన్నారు. చంద్రబాబు ఎప్పుడూ వాడే మందులే వాడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమేనన్నారు. హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తున్నట్లు వివరించారు.


Tags:    

Similar News