ఏపీ సీఎస్ కు కేంద్రం ఆదేశం : సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోండి

20 ఏళ్లు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధించిన ఐపీఎస్ అధికారికి.. ‘దిశ’ చట్టం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమంటే..

Update: 2022-04-26 04:17 GMT

అమరావతి : వైఎస్సార్సీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ పై కేంద్రం స్పందించింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై గృహహింస కేసులో తెలంగాణ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, త్వరలోనే ఈ కేసు ట్రయల్స్ కు రాబోతోందంటూ ఎంపీ రఘురామ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రఘురామ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు కేంద్రం లేఖ రాసింది.

20 ఏళ్లు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధించిన ఐపీఎస్ అధికారికి.. 'దిశ' చట్టం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమంటే మహిళల భద్రతను కాలరాయడమేనని రఘురామ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా అతనిపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులను వేధిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన మామ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు.
ఇవే కాకుండా.. సునీల్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్స్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్ఖల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని, ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారో దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో రఘురామ కోరారు. ఎంపి రఘురామ రాసిన లేఖపై స్పందించిన హోం శాఖ.. ఏపీ సీఎస్ కు లేఖ రాస్తూ.. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై రఘురామ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.


Tags:    

Similar News