క్యూలైన్ దాటి... తిరుమలలో రష్

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2023-05-17 01:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ విస్తరించి ఉంది. అత్యధిక మంది భక్తులు రావడంతో టీటీడీ తగిన చర్యలు తీసుకుంది. అన్న ప్రసాదాలను క్యూ లైన్‌లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. నడకదారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పైగానే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించే భక్తులకు మాత్రం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ నెల మొత్తం...
ఈ నెల మొత్తం తిరుమలలో భక్తుల రద్దీ అలాగే ఉంటుందని చెబుతున్నారు. వేసవి సెలవులు పూర్తయ్యేంత వరకూ భక్తుల రద్దీ ఆగదని, ప్రజలు చూసుకుని తిరుమలకు రావాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,436 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 38,980 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News