తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఆగస్టు 16 నాడు కొనసాగింది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ ఆగస్టు 16 నాడు కొనసాగింది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 75,776 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 22,700 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించనున్నారు. ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టీటీడీ రద్దు చేసింది.