సీఎం జగన్‌కు అనిత బహిరంగ లేఖ.. ఆమెది ప్రభుత్వ హత్యే ?

వైసీపీ హయాంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 1500 మందికి పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని, వాటిపై ..

Update: 2022-03-19 10:37 GMT

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళా అధ్యక్షురాలు, టిడిపి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బహిరంగ లేఖ రాశారు. మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. వైసీపీ నేతలు కాలకేయుల్లా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని సీఎం జగన్ కు తెలిపారు.

వైసీపీ హయాంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 1500 మందికి పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? అని సీఎం జగన్ ను నిలదీశారు. దిశ చట్టం కింద ఒక్క నేరస్థుడినైనా శిక్షించారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని విమర్శించారు. ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉండి కూడా.. మహిళలకు రక్షణ కరువవ్వడం నిజంగా బాధాకరమంటూ బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News