ఏపీలో మళ్లీ పొత్తులు.? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కార్‌పై ఉద్యమం చేసేందుకు అందరూ కలిసి రావాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు.

Update: 2022-05-06 08:25 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌కి వ్యతిరకంగా అందరూ కలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమం రావాలని.. ఉద్యమానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. త్యాగాలు చేసేందుకు కూడా తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

జగన్ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు కలిసి రావాలంటూ పరోక్షంగా ఇతర పార్టీలకు ఆహ్వానం పలకడం చర్చనీయాంశమవుతోంది. మరోమారు ఏపీలో కొత్త పొత్తులు పొడిచే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జనసేనతో జట్టుకట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. వైసీపీ హవా నడుస్తోందని.. భారీ మెజార్టీతో గెలవబోతోందంటూ విశ్లేషణలు.. సర్వేలు వెలువడినా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చాయి.

అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన టీడీపీ ఇటు జనసేన సాయం, అటు మోదీ ప్రభంజనంతో అధికారం చేజిక్కించుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్‌తో గ్యాప్ పెరిగిపోవడంతో గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు. ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News