ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోనని, మీ వద్దనే ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మరొకవైపు పవన్ కల్యాణ్ ఉప్పాడ తీరంలో కాలుష్యంపై కూడా ఎక్స్ లో స్పందించారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో నా మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నానన్నారు. ప్రధానంగా తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలను పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ₹90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో...
ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కోత నుండి ప్రజలను కాపాడేందుకు ₹323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి సహకారంతో రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇస్తున్నాను. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించామని, ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు ₹98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.
మూడు, నాలుగు రోజుల్లో...
మత్స్యకారులతో "మాట - మంతి" కార్యక్రమం నిర్వహించిన సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు 100 రోజుల గడువులోగా స్పష్టమైన ప్రణాళికను, ప్రజల ఆమోదంతో అమలు చేయనున్నామని పవన్ కల్యణ్ ఎక్స్ లో స్పందించారు. సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.