Nara Bhuvaneswari : బాబు బలం మీకు తెలియదు

చంద్రబాబును కాదు జైల్లో నిర్భందించింది రాష్ట్రాన్ని అని నారా భువనేశ్వరి అన్నారు

Update: 2023-10-25 12:30 GMT

తాను తొలిసారి పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చానని, తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి అనేది పోరాటం అని ఇది అందరి పోరాటం అని ఆమె చెప్పారు. అగరాలలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పేద ప్రజల కోసం చంద్రబాబు ఎప్పుడూ కష్టపడ్డారని అన్నారు. చంద్రబాబు క్రమశిక్షణతో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. ఎన్టీఆర స్పూర్తితోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లానని చెప్పారు. మూడు వేల మంది అనాధ పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పించామని తెలిపారు. వరదలు వచ్చినా తిరుపతిలో బాధితులకు లక్ష రూపాయలు ఇచ్చి ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామన్నారు. చంద్రబాబును కాదు జైల్లో నిర్భందించింది రాష్ట్రాన్ని అని ఆమె అన్నారు. నాయకుడి కోసం అందరం పోరాడాలని పిలుపు నిచ్చారు.

తన కన్నా మీకే...
చంద్రబాబు గురించి తన కన్నా మీకే బాగా తెలుసునని నారా భువనేశ్వరి అన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారన్నారు. 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టారన్నారు. ఆయన నెగిటివ్ పాయింట్స్ అన్నీ తానే ఆయనకు ముందు తాను చెప్పేదానిని అన్నారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు కష్టార్జితమన్న భువనేశ్వరి, ఐటీ మాత్రమే కాదు ఐఎస్‌బి తో పాటు అనేక కార్పొరేట్ సంస్థలను తీసుకు రావడానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన నిరంతరం పరితపించేవారన్నారు.
47 రోజుల నుంచి నిర్భందంలో....
అలాంటి చంద్రబాబును 47 రోజుల నుంచి ఎలాంటి రుజువులు లేకుండా రాజమండ్రి జైలులో నిర్భందించారన్నారు. ముందు వెయ్యి కోట్ల అవినీతి అన్నారని, తర్వాత వందలకు తీసుకు వచ్చారన్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి అరెస్ట్ చేయాలన్న ధ్యాస తప్ప మరోకటి లేదన్న నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ వారు కనపడితే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం మాత్రమే తెలుసునని అన్నారు. అవన్నీ చూసి తాను బయటకు వచ్చానని అన్నారు. చంద్రబాబు కష్టాన్ని ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. మహిళలు సయితం కూడా బయటకు వచ్చి చంద్రబాబు కోసం పోరాడారన్నారు. ఇదేనా పరిపాలన అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.
రేపైనా నిజం తెలుస్తందని...
చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లరని ప్రజలు భావిస్తున్నారన్నారు. మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల కోసం 22 పథకాలు తెచ్చారన్నారు. మహాశక్తి పథకాన్ని మహానాడులో విడుదల చేశారు. దసరాకు ఇంకా పథకాలను ప్రకటించే వారని, అయితే ఈరోజు కాకుంటే రేపైనా నిజం తెలుస్తుందని, గెలుస్తుందని అన్నారు. చంద్రబాబును నిర్భందిస్తే మానసికంగా, భౌతికంగా బలహీనమవుతుందని అధికార పార్టీ భావిస్తుందని, కానీ చంద్రబాబు చాలా బలమైన వ్యక్తిత్వం కల వారని ఆయన తెలిపారు. త్వరలోనే ఆయన బయటకు వచ్చి మీ ముందుకు వస్తారని ఆమె అన్నారు.
Tags:    

Similar News