Rain Alert : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. వానలు ఇక్కడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో నేడు వానలు...
ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
తెలంగాణలో భిన్న వాతావరణం...
తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పగలు ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, ములుగు, మెదక్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్,, ఖమ్మం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వానలు నేడు కురిసే అవకాశముందని పేర్కొంది.