జులై 3 తర్వాత కోస్తాంధ్రకు భారీ వర్షసూచన

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాకతో రెండు రోజులు భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ వర్షాలు మాయమైపోయాయి. అక్కడక్కడా జల్లులు..

Update: 2023-06-30 14:18 GMT

దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం నార్త్ ఇండియా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై.. పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాకతో రెండు రోజులు భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ వర్షాలు మాయమైపోయాయి. అక్కడక్కడా జల్లులు మాత్రం పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా.. మళ్లీ ఉక్కపోత ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

జులై 3 తర్వాత కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. జులై 3న కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దాని ప్రభావంతో కోస్తాంధ్ర లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఎక్కడెక్కడ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందో అల్పపీడనం ఏర్పడిన తర్వాత స్పష్టత వస్తుంది. ఇప్పటికే నారుమడులు పోసిన రైతులు.. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News