YSRCP : పింఛన్లను ఆపించింది చంద్రబాబే

చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసునని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

Update: 2024-04-01 13:15 GMT

చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసునని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో పింఛన్లను పంపిణీ చేయాలని చంద్రబాబు అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెన్షనర్ల ఇంటికి వెళ్లి డబ్బులు పంపకుండా చేసింది నీ బ్యాచ్ కదా? అని నాని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్లి పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల కుట్ర చేసి ఈరోజు పింఛన్లు పంచాలంటూ పత్తిత్తు మాటలు చెబుతున్నారని పేర్నినాని ఫైర్ అయ్యారు.

ఖరీదైన లాయర్లను పెట్టి...
వాలంటీర్ల వ్యవస్థపై ఖరీదైన లాయర్లను పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లింది నువ్వు కాదా? అంటూ చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. వాలంటీర్ల నడుం విరగ్గొడతానని పవన్ కల్యాణ్ అనలేదా? మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ ఆరోపణలు చేసింది పవన్ కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నడూ పేదలకు అన్యాయం జరగదని పేర్ని నాని అన్నారు. వాలంటీర్లను పక్కన పెట్టాలని ఈసీ చెప్పగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంది నిజం కాదా? అని పేర్ని నాని నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని, యాభై వేలు సంపాదన వచ్చేటట్లు చేస్తానని చంద్రబాబు చెబితే వాళ్లు నమ్ముతారా? అని అన్నారు.


Tags:    

Similar News