జగన్ పై లోకేష్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు

Update: 2023-09-30 05:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు. పసిపిల్లలకు ఇచ్చే పాలనూ వదలవా? అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న జె బ్రాండ్ మద్యం మాదిరిగానే పాల ప్యాకెట్లలోనూ ఎక్సైరీ అయిపోయినవి పిల్లలకు అందచేస్తున్నావేంటని ప్రశ్నించారు. సైకో జగన్ అవినీతి కట్టలు తెంచుకుంటుందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి పరాకాష్టకు చేరుకుందన్న లోకేష్ లక్షలాది మంది మహిళల తాళిబొట్లను ఇప్పటికే తెంచేసేలా కల్తీ మద్యాన్ని అధికారికంగా జగన్ విక్రయిస్తున్నారని ఆరోపించారు.

పాల ప్యాకెట్లను కూడా...
దీంతో సరిపెట్టకుండా చివరకు పసిపిల్లల పాలను కూడా వదలలేదని ఆయన ఫైర్ అయ్యారు. పాలను కూడా విషంగా మార్చి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన ఫొటోతో అంగన్ వాడీ కేంద్రాల్లో లీటర్ పాల ప్యాకెట్లలో నాసిరకం పాలను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ నెల 3న ప్యాక్ చేసిన ప్యాకెట్లను డిసెంబరు 2వ తేదీ వరకూ వాటిని వినియోగించాల్సి ఉన్నా గ్యాస్ బాంబుల్లా అవి పేలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులికి, జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News