చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో వస్తువులు కిందపడిపోయాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి గోడలు స్వల్పంగా బీటలువారాయి.
chittoor earthquake
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది.
పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో వస్తువులు కిందపడిపోయాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి గోడలు స్వల్పంగా బీటలువారాయి. కాగా.. గతంలో కూడా జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు భయంతో రాత్రంతా రోడ్లపై జాగారం చేశారు. తాజాగా వచ్చిన భూ ప్రకంపనల వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.