Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. అసలు రీజన్ ఇదేనట

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2024-12-17 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ధనుర్మాసం కావడంతో పాటు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒకింత రద్దీ పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. మామూలుగా ధనుర్మాసంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎక్కువ మంది ఇష్టపడతారు. ప్రపంచంలోనే ప్రతి ఇంటి దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఈ థనుర్మాసంలోనే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతాయి. తిరుమలలో కూడా దాదాపు కొన్ని రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది వచ్చి తరిస్తుంటారు. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామిని దర్శించుకుంటే మంచిదని భక్తులు అభిప్రాయపడతారు. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుబాటులోకి తెస్తారు. అయినా స్వామి వారిని ఈ మాసంలో దర్శించుకోవడం ఉత్తమమని భావించిన అనేక మంది, ఆ రోజుల్లో వచ్చి ఇబ్బంది పడేకంటే ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటే మంచిదని భావిస్తారు. ఇక విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా ఏడాది చివరి నెల కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వస్తారని అధికారులు చెబుతున్నారు.



 


25 కంపార్ట్ మెంట్లలో...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల కావడంతోనే ధనుర్మాసంలోనే దర్శనం చేసుకునేందుకు ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటారని, అయితే అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లలో వేచి ఉన్న వారికి అవసరమైన అన్నప్రసాదాలను కూడా అందచేస్తున్నామని తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,112 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,541 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్ రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.





Tags:    

Similar News