Ys Sharmila : వైఎస్ జగన్ పై షర్మిల సెటైర్లు విన్నారా?
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విద్యుత్తు ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విద్యుత్తు ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు. 2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, జగన్ రూ 2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా? అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు శాలువాలు కప్పలా? అని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? అంటూ ఎకసెక్కాలు చేశారు.