జనసేన కాదిది ఆంధ్రా మతసేన
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారన్న షర్మిల ఇప్పుడు ఆయన మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పవన్ నరనరాన జీర్ణించుకున్నారని, జనసేనా పార్టీని "ఆంధ్ర మతసేనా" పార్టీగా మార్చారంటూ షర్మిల ఫైర్ అయ్యారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను...
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా పవన్ కల్యాణ్ వైఖరి ఉండటం విచారకరమని అన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నామన్న వైఎస్ షర్మిల స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని అన్నారు. బీజేపీ మైకం నుంచి బయట పడాలంటూ హితవు పలికారు.