తిరుపతిలో ఒమిక్రాన్ కలకలం

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయింది. తిరుపతిలో మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు.

Update: 2021-12-12 12:33 GMT

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల ఐర్లాండ్ నుంచి విజయనగరం వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు. పెద్దకాపు వీధికి చెందిన 34 సంవత్సరాల వ్యక్తి ఇటీవలే యూకే నుంచి ఢిల్లీ మీదుగా తిరుపతికి చేరుకున్నాడు. ఆదివారం అతనికి జీనోమ్ టెస్ట్ చేయగా.. ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. సదరు ఒమిక్రాన్ బాధితుడు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. రెండవ ఒమిక్రాన్ కేసుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రజల్లో భయాందోళనలు...
ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కి చేరింది. దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతుండటం వల్లే కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. లేదంటే ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.



Tags:    

Similar News