అన్నదాత సుఖీభవ పథకంపై అమలుపై చంద్రబాబు సమీక్ష
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావాలని కోరారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో 14,000 ప్రభుత్వం ఇవ్వనుంది.
మూడు విడతలుగా...
ఈ పథకం కింద ఏడాదికి రైతుకు 20,000 రూపాయల నగదును మూడు విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా 5,000 రూపాయలు కేంద్రం వాటా రెండు వేల రూపాయల చొప్పున ఆగస్ట్ 2వ తేదీన విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది పొందుతారని చెప్పింది. ఇందుకోసం 2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పీఎం కిసాన్ మొదటి విడత కింద 831.51 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమచేయనుంది. ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.