ఇక్కడా ఎదురుదెబ్బ

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ రిమాండ్‌కు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది

Update: 2023-09-22 09:19 GMT

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ రిమాండ్‌కు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయనను సీఐడీ అధికారులు రాజమండ్రి జైలులోనే విచారించనున్నారు. ఈ కేసులో అరెస్టయిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు చంద్రబాబును సీఐడీకి అప్పగించే విషయంలో కస్టడీ పిటీషన్ పై తీర్పు చెప్పింది.

ఎన్ని రోజులంటే...
సీఐడీ అధికారులు చంద్రబాబును తమకు కస్టడీకి అప్పగించాలని కోరుతూ వేసిన పిటీషన్‌పై మొన్న ఐదు గంటల పాటు విచారణ సాగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. వాస్తవానికి నిన్ననే వెలువరించాల్సి ఉన్నప్పటికీ నేటికి వాయిదా వేశారు. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ కూడా ముగిసింది. ఎల్లుండి వరకూ రిమాండ్ ను పొడిగించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు అథ్యయనం చేయాలంటే తమకు కస్టడీకి చంద్రబాబును అప్పగించాలని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించారు. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ కేసు బనాయించారని, కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదించారు. మొత్తం మీద ఏసీబీ కోర్టు మాత్రం సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయనను అధికారులు విచారించనున్నారు.


Tags:    

Similar News