Andrhra Pradesh : మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు
మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరాకు మైసూరులో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంలో అక్కడ కొలువైన చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలోనూ, మహారాజా ప్యాలెస్ లోనూ జరిగే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను చూసేందుకు పెద్ద సంఖ్యలో దేశం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతారు.
ఇంద్రకీలాద్రిపై...
అదే సమయంలో విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విజయవాడ ఉత్సవ్ పేరుతో సన్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్మెంట్ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. ఇంద్రకీలాద్రిలోనూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.