వాణికి అంత తాపత్రయం ఎందుకు?

Update: 2017-10-14 02:30 GMT

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. తెలుగుదేశం వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్ లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్ తో ఆయన ఆఖరిచిత్రం హీరోయిన్ గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు ఒక వేళ తీస్తే అది ఆయన అభిమానుల మనసు నొచ్చుకునేలా ఉంటే వర్మ ఇంటిముందు ధర్నా చేయాలిసి వస్తుందన్నారు. వర్మని హెచ్చరిస్తూ ఆమె సోషల్ మీడియా లో చేసిన పోస్టింగ్ మరో చర్చకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం ఆమె టీడీపీలో చేరదామని భావిస్తుండటమే. త్వరలోనే టీడీపీలో చేరదామనుకుంటున్న వాణి విశ్వనాధ్ వర్మపై ఈ కౌంటర్ వేశారు.

టీడీపీలో చేరేందుకేనా?

వాణి విశ్వనాధ్ గత కొద్ది రోజులుగా టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో వైసీపీ నేత రోజాకు పోటీగా దించాలని టీడీపీ భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల విడుదలయిన జయ...జయ...జానకితో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వాణి విశ్వనాధ్ మళయాళి. తెలుగు కూడా సరిగా రాదు. అయినా సరే... తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. వాణి పీఏ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాణి విశ్వనాధ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. కాని చంద్రబాబు నగరి నియోజకవర్గాన్ని వాణి విశ్వనాధ్ కు ఇచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అక్కడ గాలి వారసులు గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకూ వాణి విశ్వనాధ్ టీడీపీలో చేరికపై స్పష్టత రాలేదు. దీంతోనే వాణి విశ్వనాధ్ వర్మపై కామెంట్స్ చేసి చంద్రబాబుకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మరి వాణి విశ్వనాధ్ ప్రయత్నాలు ఫలిస్తాయో... లేదో... చూడాలి.

Similar News