రాంగోపాల్ వర్మ టాలీవుడ్ బాలీవుడ్ లలో ప్రస్తుతం ప్లాప్ డైరెక్టర్ గా పేరొందిన దర్శకుడు. ఒకప్పుడు వర్మ అంటే వెండితెరపై సంచలనం. ఇప్పుడు వర్మ కేవలం మీడియా లోనే సంచలనం. ఆయన పొలిటికల్ యాంగిల్ లో తీసిన రక్త చరిత్ర కానీ, వంగవీటి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. అలాంటి దర్శకుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత ఘట్టంలోని కేవలం ఒకే ఒక్క భాగం తీస్తానంటే టిడిపి వణుకుతుందా ...? భయపడుతోందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎందుకు టిడిపికి భయం ...?
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకం అంటే లక్ష్మీపార్వతిని పెళ్లి ఆడిన నాటినుంచి రాంగోపాల్ వర్మ చిత్రం ఆరంభం అవుతుంది. ఆ పెళ్ళి నందమూరి కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది. ఎన్టీఆర్ వారసులు ఆయన రాజకీయ వారసత్వాన్ని పెద్దగా కోరుకోలేదు, కానీ అలా చేయాలని చేసిన ప్రయత్నాలు లేవు. ఇక వున్నది పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు , చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు . వీరిద్దరూ ఆయన రాజకీయ వారసులుగా పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న తరుణం . పెద్దాయన తరువాత నేనే సీఎం అని కలలు కనే రోజులు . అనూహ్యంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సతీమణిగా రంగప్రవేశం తో అధినేతనే వెన్నుపోటు పొడిచేలా సాగాయి. ఆరోగ్యం సహకరించకపోతే ఎన్టీఆర్ ఏ సమయంలో అయినా లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రిని చేసి పారేయొచ్చన్నది వారి లో భయం మొదలైంది. దాంతో పక్కాగా స్కెచ్ తో ఆగస్టు సంక్షోభానికి చంద్రబాబు తెరతీశారు. ఈ ఎపిసోడ్ లో దగ్గుబాటిని డిప్యూటీ సీఎం చేస్తా అని బావ హరికృష్ణ కు చక్రం తిప్పే లా అవకాశం కల్పిస్తా అన్న చంద్రబాబు మాటలు అంతా నమ్మి ఆయన్ను ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. భాగ్యనగర్ నడిబొడ్డున వైస్రాయి హోటల్ సాక్షిగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతులు తమ ఎమ్యెల్యేల కోసం వెళితే బాబు బృందం చెప్పులు విసిరి తీవ్రంగా అవమానించింది. నాటి స్పీకర్ యనమల ను తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ అసెంబ్లీలో ప్రాధేయపడినా ఆయన కు మైక్ ఇవ్వే లేదు. పార్టీ నిధులను సైతం ఎన్టీఆర్ ఉపయోగించుకోకుండా ఆయన టిడిపి పార్టీ కాదంటూ నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటారు . దాంతో ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని పెట్టుకోవాలిసి వచ్చింది . ఆయన గుర్తు సైకిల్ కాదు. దురదృష్ట వశాత్తు ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందే మానసిక వ్యధ తో అల్లుళ్ళు కొడుకులు చేసిన ద్రోహంతో కుమిలి కుమిలి ఎన్టీఆర్ 1996 జనవరి 18 న కన్నుమూశారు . ఇదంతా చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఎన్టీరామారావే . జామాత దశమ గ్రహం అంటూ ఆయన విడుదల చేసిన ఆడియో క్యాసెట్లు , నాడు జెమిని టివి లో ప్రజలతో ముఖా ముఖీలో చెప్పినవే. ఇవన్నీ ప్రజలకు తెలియనివి కావు. మరి వర్మ కొత్తగా చెబుతున్నది ఏమిటి ? అంటే ఏమిలేదు . కానీ ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసి చనిపోయాక ఆయన జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్న పాత్రలన్నీ నేటి కొత్త జనరేషన్ కి అర్ధం అవుతాయి . ఎన్టీఆర్ కే ద్రోహం చేసి అది కేవలం పార్టీ అంతర్గత సంక్షోభం గా చిత్రీకరించి ప్రజలను మాయ చేసిన తీరు నేటితరం గుర్తిస్తుంది . నీతులు చెప్పే నేతలు నడిచిన దారి వెండితెరపై దృశ్యరూపంగా రికార్డ్ లో నిలుస్తుంది .అదే భయం ఇప్పుడు టిడిపిని వెన్నాడుతుంది .
చరిత్ర చింపితే చిరగదు ....
సినిమా అన్నది అత్యంత ప్రభావవంతమైన దృశ్య మాధ్యమం . అందుకే దక్షిణాదిన తారలు జన హృదయాలను గెలుచుకుని ముఖ్యమంత్రులు గా రాణించారు . ఆ కోవలోనే ప్రపంచ ప్రఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు వారి ఆత్మాభిమానానికి కేరాఫ్ అడ్రెస్ గా ఢిల్లీ పాలకులకు తొడ కొట్టిన ధీరుడిగా ఎన్టీఆర్ రచ్చ గెలిచారు. కానీ ఇంట గెలవలేక పోయారు. ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మండలాధీశుడు వంటి చిత్రాలను ఆయన విధానా నిర్ణయాలకు వ్యతిరేకంగా తెరకెక్కించిన సినిమాను సినిమాలాగే ఆయన లైట్ తీసుకున్నారు . ఆ సినిమా ఆపేయాలని ఇప్పుడు చేస్తున్నంత వివాదం నాటి టిడిపి శ్రేణులు చేసింది లేదు. అలాగే పిచ్చోడి చేతిలో రాయి వంటి చిత్రాలు , ఈనాడు రామోజీ రావు ను టార్గెట్ చేస్తూ జర్నలిస్ట్ వంటి సినిమాలు విడుదల అయినా ఎలాంటి రచ్చా సాగలేదు. కానీ ఎన్టీఆర్ జీవితంలో దుర్భర క్షణాలే ఇతివృత్తంగా సినిమా రావడాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతుంది. నాడు ఎన్టీఆర్ కి ద్రోహం తలపెట్టిన పాత్రలు వర్మ తీయబోయే చిత్రానికి వణుకుతున్నాయి. ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఎలాగైనా ఈ చిత్రం ఆపాలన్న దిశగా ఇప్పుడు టిడిపి లోని కీలక నేతలంతా రోజు అదే పనిలో ఉన్నారా అన్నంతగా వర్మను టార్గెట్ చేస్తున్నారు బెదిరింపులకు సైతం దిగిపోతున్నారు. అట్టర్ ప్లాప్ డైరెక్టర్ కి స్టార్ ఇమేజ్ ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి నేతలు తెలిసో తెలియకో తీసుకొచ్చేశారు.
ఎన్నికల తరుణంలో వస్తుందన్నది మరో బాధ ...
వైసిపి సానుభూతిపరుడు రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఎన్నికల ముందు సరిగ్గా విడుదల చేయాలన్న సంకల్పంతో నిర్మాణం సాగుతుంది . దాంతో ఇది పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ తెస్తుందన్నది టిడిపి వర్గాల బాధ. వర్మ తీసే సినిమా ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులు ముందే చెప్పేస్తారు. తెలుసున్న కథను దర్శకుడు ఎలా తెరకు ఎక్కించాడా అని ప్రతి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. ఎన్నికల వేడిలో ఇలాంటి సినిమాలకు కమర్షియల్ గా మంచి డిమాండ్ ఉంటుంది . కలెక్షన్లు బాగుంటాయి. ఇప్పుడు నడుస్తున్న పైరసీ యుగంలో వారం రోజుల్లో బాక్స్ ఎత్తేయొచ్చు. కానీ పబ్లిక్ లో పార్టీ అధినేత పాత్రపై సెటైర్స్ బలంగా నడుస్తాయి. జగన్ అవినీతి , అక్రమాస్తులు వంటివి ఆయన క్యారెక్టర్ పై టిడిపి చేస్తున్న పోరాటం వర్మ సినిమా తెచ్చే తగవుతో మొత్తం కొట్టుకు పోనున్నాయి. ఆ కోణంలో కూడా టిడిపి భయపడుతుంది. వర్మ ఇలాంటి ప్రచారమే కోరుకుంటారు. టిడిపి అదే చేస్తుంది.