అతిథులంతా వచ్చారు.. హాయిగా నోటికి వచ్చిన మాటలేవో చెప్పారు.. కవులు రచయితలు శాలువలు కప్పించుకుని వెళ్లారు తరించారు.. ఇంకా కాస్తో కూస్తో నగదు ప్రోత్సాహకాలు కూడా అందుకున్నారు. ఇవీ నిన్నటి తెలుగు మహాసభలులో చోటుచేసుకున్న ఘటనలు.. బాగుంది నాల్రోజుల సభ గురించి కనీసం ఓ నాల్రోజులైనా మాట్లాడుకోవాలి కదా??! ప్రగతి శీలం లేని రచయితల గురించి ఫక్కున ఓ నాల్గు సార్లు అయినా నవ్వుకోవాలి కదా! ఇంతకూ ఆ మయ సభ ఖర్చెంతో తెలుసా వంద కోట్లు.. ఊహించగలరా..! ఇంతకూ వీరేం సాధించారో చెప్పగలరా!
అన్నమో రామచంద్రా..
ఈ సభలకు ఒక్క భోజన ఏర్పాట్లకే రెండు కోట్లకు పైగా వెచ్చించారని వినికిడి. ఇంకా ఈ ఖర్చు ఫైనల్ కాలేదు. తొలుత అనుకున్న యాభై కోట్ల రూపాయల ఖర్చు చేయి దాటిపోయి కేసీఆర్ ఆర్భాటాల పుణ్యమాని వంద కోట్ల రూపాయలకు ఖర్చు చేరుకుంది. ఇంత చేసి ఏ భాషను ఏ యాసని వీరు సంస్కరించారో చెప్పగలరా!ఉద్యమంలో ఎలుగెత్తిన పాట ఇవాళ లేదు .. కవిత్వం ఇవాళ పల్లవించడం లేదు.. ప్రభుకీర్తన తప్ప మరేమైనా ఉందా?? అసలు తోటి తెలుగు రాష్ట్రమే పట్టించుకోని అది మహా సభ ఎలా అవుతుంది.
మళ్లీ భావోద్వేగాలను మళ్లించేందుకేనా...
ఉద్యమం వెల్లువెత్తినపుడు కేసీఆర్ భావోద్వేగాలను రెచ్చగొట్టి రెచ్చిపోయారు. అటుపై ఆయన తీరు అనేకానేక విమర్శల పాలైన నేపథ్యంలో తెరపైకి తెచ్చిన ఈ డ్రామాకి సోకాల్డ్ మేథావులు తానా తందానా అన్నారే! బాగుంది.. వీళ్లే రచయితలు వీళ్లే మనుషులు.. కాదు కాదు దమన నీతి ప్రశ్నింపలేని పరాన్న భుక్కులు.నీతో నా బాగేంది అన్నట్టుగా ఉన్న ఈ మాతృభాషనా మన పాలకులు బతికేంచేది.. ఏమో! నాలుగు రోజులు పాటు ఎన్ఆర్ ఐ లకు ఇవ్వాల్సిన ఆతిథ్యం కాస్త ఏడు రోజులు చేసి తెగ హంగామా చేసి టీ సర్కారు ఇప్పుడిక ఏం సమాధానం చెబుతోందో! మరి! పోనీ అలా అని ప్రవాస తెలంగాణ వాసుల నైనా పట్టించుకున్నారా??? ఓ లెక్క ప్రకారం ఇప్పటివరకు రూ.80 కోట్ల ఖర్చు వివరాలు అందాయని, పూర్తి స్థాయి లెక్కలు అందితే ఖర్చు మరో రూ.20 కోట్లు పెరుగుతుందని ఓ అంచనా! ఇంతకీ ఏం సాధించినట్లు?